103. పాప పుణ్యాల యొక్క మూలాలు
Description
“పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అనగా గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచుండును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.14).
పరమేశ్వరుడు సృజనకారుడు కాదు కానీ సృజనాత్మకత అనే
అవగాహనతో ఈ శ్లోకమును సులభముగా అర్ధము చేసుకోవచ్చు. సృష్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కుండను సృష్టించే కుమ్మరి లాంటిది. కుండ అనే సృష్టి సృష్టికర్త (కుమ్మరి) నుంచి వేరు చేయబడి తన ప్రయాణాన్ని స్వతంత్రంగా సాగిస్తుంది. నాట్యాన్ని సృష్టించే నర్తకుడు మరొక ఉదాహరణ. నర్తకుడు లేనప్పుడు నాట్యమే (సృష్టి) ఉండదు. దైవం కూడా నర్తకుని వంటి వారు. సమస్త విశ్వం ఆయనపై ఆధారపడి ఉంది కానీ ఆయన ఎవరిపై ఆధారపడరు. అందుకే నాట్యం చేసే శివుడిని 'నటరాజు' గాను, మురళీ గానము వినిపించే శ్రీకృష్ణుడిని 'మురారి' గాను వర్ణిస్తారు.
దైవం ఒక రసాయనక చర్యలో ఉత్ప్రేరకం వంటిది. ఉత్ప్రేరకం రసాయనిక చర్యను ప్రభావితం చేస్తుంది కానీ ఉత్ప్రేరకం
ఎలాంటి మార్పుకు లోనుకాదు.
“సర్వ వ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాపకర్మలలో దేనికీ భాగస్వామి కాడు. అజ్ఞానంచే జ్ఞానము కప్పబడి ఉండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు (5.15). కానీ వారి (ప్రాణుల) అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము సూర్యుని వలే పరమాత్మను దర్శింపచేయును” అని శ్రీకృష్ణుడు బోధిస్తారు (5.16).
దైవం ఒక సినిమా హాల్లో తెర వంటి వారు. తెరకు దానిపై ప్రదర్శింపబడిన బొమ్మలతో సంబంధం లేదు. కానీ
ప్రేక్షకులు భావోద్వేగాలకు లోనవుతారు. ఈ ప్రదర్శనలు నీడల వంటివి. మనమందరం ఈ నీడలతో గాఢంగా ఐక్యమవడం వలన దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే ఉద్వేగాలను, అభిప్రాయాలను సృష్టించు కుంటాము. ఈ మొత్తం ప్రక్రియలో తెర తటస్థంగా ఉంటుంది మన ఉద్వేగాలతో దానికి సంబంధం లేదు.
ఇటువంటి పరిస్థితుల కొరకు శ్రీకృష్ణుడు ఇంతకుముందు 'మోహకలిలం' అన్న పదం ఉపయోగించారు (2.52). మనము మోహం నుంచి బయట పడినప్పుడు కప్పబడి ఉన్న తెరలు తొలగి మన అవగాహన, వివేకము సూర్యుడిలా ప్రకాశిస్తాయి.